
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖము శుక్ల పక్షము వసంత ఋతువు ఏకాదశి గురువారం మే 8వ తేదీ
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది.

సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది.

అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధ భరిత పుష్పమాలలను,పట్టు పితాంబరాలను మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకొని వచ్చి శ్రీ స్వామివారికి తోమాల సేవలో పుష్పమాలలను మరియు మెల్ చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది.
ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.
స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం.స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది.అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని,లడ్డు,వడ,తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు

ఉదయం 10:30 లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్నఖచిత స్వర్ణాభరణాలతో,పరిమళ భరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.


ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదిప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని ఆర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు శ్రీవారిని నయనానందకరంగా దర్శించుకున్నారు.